కడప,మహి న్యూస్ఆ గస్టు 12: ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి), కడపలో అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ విజ్ఞాన సదస్సు, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి వారి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప చైర్మన్-కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని సూచనలతో ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్. బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ యువత తమ హక్కులు, బాధ్యతలు, విద్య, ఉపాధి అవకాశాలతో పాటు సమాజ అభివృద్ధిలో తమ పాత్రపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వాటికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలపై కూడా అవగాహన కల్పించారు.
అవసరమైన ప్రతి ఒక్కరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే ఉచిత న్యాయ సహాయం, న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువత చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అలాగే 2026 సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్, శాశ్వత లోక్ అదాలత్, నల్సా పథకాలు, లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ 15100, చైల్డ్లైన్ హెల్ప్లైన్ 1098, దివ్యాంగజన్ హెల్ప్లైన్ 14456 తదితర అంశాలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి), కడప ప్రిన్సిపాల్ జే. వెంకటలక్ష్మి, ఎన్సీసీ అధికారులు, అధ్యాపకులు, కోర్టు సిబ్బంది, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments