పల్నాడు జిల్లా, మహి న్యూస్, సెప్టెంబర్ 12: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రూ.249 కోట్ల వ్యయంతో చేపట్టిన 22 వైద్య ప్రాజెక్టులను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో వీటిని వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి వచ్చాయి. క్రిటికల్ కేర్ యూనిట్ల ద్వారా సుమారు 500 క్రిటికల్ కేర్ పడకలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక శస్త్రచికిత్స గదులు, అల్ట్రాసౌండ్ సేవలతో పాటు గుండె వైద్యం, మూత్రపిండాల వైద్యం, నాడీ సంబంధిత వైద్యం, న్యూరో శస్త్రచికిత్స వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి.
లింగంగుంట్లలో ఆధునిక సమగ్ర ప్రయోగశాల
నరసరావుపేట పరిధిలోని లింగంగుంట్ల ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలను కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు.
ఈ ప్రయోగశాల అందుబాటులోకి రావడంతో నరసరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య పరీక్షలు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. వివిధ రకాల వైద్య పరీక్షలను స్థానికంగానే నిర్వహించుకునే అవకాశం కలగడంతో ప్రజలకు సమయం, ఖర్చు ఆదా కానుంది.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ సమగ్ర ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద బాబు తదితరులు పాల్గొన్నారు.
0 Comments