Thursday, 06 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

కడప ‘స్మార్ట్ కిచెన్‌’కు జపాన్ ‘జైకా’ ప్రశంసలు

విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, నాయకత్వ వికాసానికి ఆదర్శ నమూనా

జపాన్ పాఠశాలలతో విద్యా సహకారానికి ముందుకొచ్చిన జైకా ప్రతినిధులు

కడప, ఆగస్టు 5 (మహి న్యూస్): వైఎస్సార్ కడప జిల్లాలో అమలవుతున్న ‘స్మార్ట్ కిచెన్’ (ఆధునిక వంటశాల) వ్యవస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. విద్యార్థులకు పరిశుభ్రమైన, పోషకాహార మధ్యాహ్న భోజనం అందించడమే కాకుండా, వారిలో క్రమశిక్షణ, పరిశుభ్రత, జట్టు భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వినూత్న కార్యక్రమంగా ఇది నిలుస్తోందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) నిపుణురాలు యుమికో ఓనిషి ప్రశంసించారు.

జపాన్–భారత్ అభివృద్ధి సహకార కార్యక్రమంలో భాగంగా బుధవారం జైకా, నీతి ఆయోగ్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి దృశ్య మాధ్యమ సమావేశం ద్వారా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ (ఆధునిక వంటశాల) వ్యవస్థతో పాటు ‘ఏఎన్‌టీఎస్’ (క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి, పరిశుభ్రత ద్వారా పోషకాహార కార్యాచరణ) అమలు తీరును దృశ్య ప్రదర్శన ద్వారా వివరించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజనాన్ని కేవలం ఆహార పంపిణీ కార్యక్రమంగా కాకుండా, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమైక్యత, బాధ్యత, నాయకత్వం, పరిశుభ్రత, ఆహారం పట్ల గౌరవం, ఆహార వృథా నివారణ వంటి విలువలను పెంపొందించే విద్యా ప్రక్రియగా మార్చామని తెలిపారు.

ప్రస్తుతం జిల్లాలో 38 ఆధునిక వంటశాలల ద్వారా 1,788 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు లక్ష మంది విద్యార్థులకు ప్రతిరోజూ వేడి, పరిశుభ్రమైన, పోషకాహార మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార తయారీ, రవాణా, నాణ్యత, ఉష్ణోగ్రత, సమయపాలన వంటి అంశాలను డిజిటల్ విధానంలో కాకుండా సాంకేతిక పర్యవేక్షణ విధానంలో పరిశీలిస్తున్నట్లు వివరించారు.

ప్రస్తుతం 10 పాఠశాలల్లో అమలవుతున్న ఏఎన్‌టీఎస్ కార్యక్రమాన్ని దశలవారీగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరిస్తామని తెలిపారు.

జైకా నిపుణురాలు యుమికో ఓనిషి మాట్లాడుతూ, కడప జిల్లా రూపొందించిన ఆధునిక వంటశాల – ఏఎన్‌టీఎస్ నమూనా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థుల ప్రవర్తనా మార్పుకు దోహదపడే విద్యా ప్రక్రియగా మలచడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర నివేదిక సిద్ధం చేస్తే ఇతర ప్రాంతాలకు కూడా పరిచయం చేసే అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు.

సమావేశంలో జైకా బృంద సభ్యులు హితోమీ హమాడా, బినయ్ పట్నాయక్, మోహిత్ సూద్, నీతి ఆయోగ్ రాష్ట్ర నోడల్ అధికారి కార్తీక్ రెడ్డి పలు సూచనలు చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహార స్థితి, ప్రవర్తనా మార్పులపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.

జపాన్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన విధానాలను ప్రత్యక్షంగా అధ్యయనం చేయాలనే ఆసక్తిని జిల్లా కలెక్టర్ వ్యక్తం చేయగా, అవసరమైన సహకారం అందిస్తామని జైకా ప్రతినిధులు హామీ ఇచ్చారు. అలాగే కడపలో అమలవుతున్న ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు త్వరలో జిల్లాను సందర్శిస్తామని తెలిపారు.

దృశ్య మాధ్యమ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శంశుద్దీన్, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త అనురాధ, యువ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X